ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షణికావేశంలో తీసుకున్న ఆ నిర్ణయం...విషాధంగా మారింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 09:39 PM

క్షణికావేశంలో తీసుకున్న ఆ నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం టి రాచపల్లి పంచాయతీ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. దిగువబురుజపల్లెకు చెందిన ప్రతాప్ రెడ్డి, ఓబులేశ్వరి కుమార్తె లావణ్యకు 2016లో పీలేరు మండలం, జాండ్ల పంచాయతీ పరిధిలోని దిగువపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డితో వివాహం జరిగింది. వీరికి పరమేష్ (4), మౌనిక (2.6) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, సుబ్రహ్మణ్యం రెడ్డి తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.


భార్యాభర్తలు అక్కడ ఉండగా.. మూడు నెలల కిందట గొడవ జరిగింది. దీంతో లావణ్య తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఇదిలావుంటే లావణ్య తాత సురేందర్ రెడ్డి కాలం చేయడంతో ఆగస్టు 16న జరిగిన ఆయన కర్మకాండలకు సుబ్రహ్మణ్యం రెడ్డి వచ్చాడు. కర్మలు ముగిసిన తర్వాత భార్య, పిల్లలను తన వెంట తీసుకెళ్లేందుకు సుబ్రహ్మణ్యంరెడ్డి ప్రయత్నించారు. కానీ, భర్తతో వెళ్లేందుకు లావణ్య నిరాకరించగా.. కనీసం పిల్లలనైనా తనతో పంపించాలని కోరాడు.


ఈ నేపథ్యంలో, తన ఇద్దరు పిల్లలను బలవంతంగా తమ పొలంలోని వ్యవసాయ బావి వద్దకు వెంటబెట్టుకొని వెళ్లిన లావణ్య.. ఎవరు లేని సమయం చూసి వారితో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాలను బావి నుంచి బయటకి తీసే ప్రయత్నం చేశారు. బావి నుంచి ముగ్గురు మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదుచేసిన గుర్రంకొండ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. క్షణికావేశంలో లావణ్య తీసుకున్న కఠిన నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో దిగువ బురుజుపల్లెలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com