ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చినజీయర్ స్వామి చురకలంటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల దుస్థితిపై ఆధ్మాత్యిక గురువు చినజీయర్ స్వామి వ్యంగంగా స్పందించారు. తెలంగాణ సరిహద్దుల్లోని జంగారెడ్డి గూడెం నుంచి రాజమండ్రికి వెళ్లడానికి 3 గంటలు పట్టిందని ఆయన తెలిపారు. ‘ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉండొచ్చు.. ఒక్కోసారి గోతులు ఎక్కువగా ఉండొచ్చు.. మేం జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడికి దాకా రావడానికి.. చాలా బాగుంది.. చక్కగా జ్ఞాపకం ఉండేలా ఉంది’ అంటూ భక్తులతో మాట్లాడే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆహ్వానం మేరకు రాజమండ్రి వెళ్లిన చినజీయర్ స్వామి.. ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ లో రోడ్ల దుస్థితికి అద్దం పడుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి జంగారెడ్డి గూడెం నుంచి రాజమండ్రి వెళ్లే రోడ్డు చాలా ఏళ్లుగా దారుణ స్థితిలో ఉంది. భారీ గుంతలతో ఈ మార్గంలో ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది.