ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 10:28 PM

పాస్టర్ ల గౌరవ వేతనానికి సంబంధించి నిబంధనలను ఏపీ ప్రభుత్వం సడలించింది. మూడుసార్లు దరఖాస్తులు స్వీకరించినా ఆశించిన స్థాయిలో అర్హులు లేరనే కారణంతో ఈ నెల 25వ తేదీ వరకు గడువుగా నిర్ధారించి ప్రభుత్వం అప్లికేషన్లు స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాస్టర్లకు నెలకు రూ. 5 వేల గౌరవ వేతనం అందించే నిబంధనల్లో జగన్ ప్రభుత్వం మరోసారి సడలింపులు ఇచ్చింది. గౌరవ వేతనానికి చర్చిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటామని, అన్ని పథకాలకు అమలు చేస్తున్న ఆరు దశల నిబంధనలు ఈ పథకానికి వర్తించబోవని తేల్చి చెప్పింది.


 స్థలం చర్చి పేరుపై రిజిస్టరై ఉండాలనే షరతును కొనసాగిస్తూనే.. చర్చి పేరుపై తహసీల్దారు జారీ చేసిన పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఉన్నా, దాతలు ఇచ్చిన రిజిస్టర్‌ గిఫ్ట్‌ డీడ్‌ ఉన్నా సరిపోతుందని ఇప్పటికే నిబంధన మార్చింది.


తాజాగా, మరికొంత సడలింపునిచ్చి స్థానికంగా ఉన్న వీఆర్వో, సంక్షేమ కార్యదర్శి పరిశీలించి ధ్రువీకరణ పత్రం ఇచ్చినా సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాతలు ఇచ్చిన స్థలాల్లో, అద్దె ఇళ్లలో ఉండే చర్చిలకు గాను నోటరీ సర్టిఫికెట్‌ సమర్పిస్తే సరిపోతుందని వెల్లడించింది. సొసైటీ చట్టం ప్రకారం చర్చి రిజిస్టరై ఉండాలనే నిబంధన మాత్రమే ఉండగా ఇప్పుడు అదనంగా ట్రస్ట్‌ను కూడా జత చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా ఒకే రిజిస్ట్రేషన్‌ కలిగి వేరు వేరు ప్రాంతాల్లో బ్రాంచ్ చర్చిలు ఉన్నా, ఆయా ప్రాంతాల్లోని బ్యాంకుల్లో వేర్వేరుగా ఖాతాలు కలిగి ఉంటే అందులోని పాస్టర్లు గౌరవ వేతనానికి అర్హులేనంటూ జిల్లా స్థాయి అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. చర్చి సొసైటీ లేదా ట్రస్ట్‌కు ఇతర ఆదాయాలు లేవని పాస్టర్‌/ సభ్యులు ధ్రువీకరిస్తే చాలని పేర్కొంది.


ఇక, పాస్టర్లకు సంబంధించి కులధ్రువీకరణ పత్రం కూడా అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతాతో పనిలేదని స్పష్టం చేసింది. పాస్టర్ల కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ ఉన్నా, వైఎస్సార్‌ పింఛన్ కానుక కింద లబ్ధి పొందుతున్నా గౌరవ వేతనానికి అర్హులేనని ఆదేశాలు జారీ చేసింది. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు పాస్టర్లు ఉండి వారు వేర్వేరు చర్చిలకు పాస్టర్లుగా వ్యవహరిస్తుంటే వారు కూడా అర్హులేనని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com