కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆదివారం విడుదల చేసింది. ఏప్రిల్, మే, జూన్ మొత్తం 3 నెలలకు సంబంధించి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారం తదితర సేవా టికెట్లను అందుబాటులో ఉంచింది. వర్చువల్ క్యూ పద్ధతిలో ముందు వచ్చినవారికి భక్తులకు టికెట్లు కేటాయించనున్నారు. ఇక సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం, టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో అందించనున్నారు. ఆదివారం నుంచి 22న ఉదయం 10 గంటల వరకు భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకునేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. టికెట్లు పొందిన వారి జాబితాను 22న మంగళవారం ఉదయం 10 గంటల తరువాత టీటీడీ వెబ్సైట్లో ఉంచనున్నారు. సేవా టికెట్లు పొందిన భక్తులు 2 రోజుల్లోపు వాటికి నిర్ణీత ధర చెల్లించాలి. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ను కలిగి ఉండాలని టీటీడీ స్పష్టం చేసింది. లేనిపక్షంలో రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలని సూచించింది.