అభంశుభం తెలియని ఆ బాలుడు ఆడుకుంటూ బంధువుల ఇంటికి వెళ్లాడు. అనుకోకుండా అక్కడ అభ్యంతరకర రీతిలో బాబాయిని, ఓ మహిళను చూశాడు. ఇక తమ వివాహేతర సంబంధం బయటపడుతుందని వారిద్దరూ భయపడ్డారు. బాలుడి మర్మాంగాలపై దాడి చేసి, మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేశారు. బాలుడు ప్రాణాలు పోయాయని తెలిసిన తర్వాత చెట్టుకు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసుల విచారణలో వాస్తవాలు బయటపడడంతో జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. దీనిక సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని చిత్తూరు జిల్లా కలికిరి మండలంలోని అద్దవారిపల్లె రాజేశ్వరి అనే మహిళతో కలిచెర్ల సహదేవ అనే వ్యక్తికి చనువు ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నెల 11న సాయంత్రం వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఆ సమయంలో సహదేవ అన్న కొడుకు ఉదయకిరణ్(8) ఆడుకుంటూ అక్కడికి వచ్చేశాడు. వారిని చూసి, విషయాన్ని అందరికీ చెబుతానని అన్నాడు. భయంతో వారిద్దరూ బాలుడిని పట్టుకున్నారు. కోపంలో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆపై గొంతుకు టవలు బిగించి చంపేశారు. అదే రోజు రాత్రి శవాన్ని గ్రామ శివారులోని వేప చెట్టుకు ఉరేసి వేలాడదీశారు. బాలుడి తల్లిదండ్రులు తమ కుమారుడి కోసం అన్ని చోట్ల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు సాయంత్రం బాలుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి, విచారణ చేపట్టారు. చివరికి నిందిలిద్దరూ హత్యకు పాల్పడ్డారని తెలుసుకుని, అరెస్టు చేసి శనివారం రిమాండుకు పంపారు.