చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మగశిశువును ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని మహిళలు తెల్లవారుజాము 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పక్కనే ఉండాల్సిన పసిబిడ్డ లేకపోవడంతో ఉలిక్కిపడి లేచిన తల్లి చుట్టూ చూసింది. ఆస్పత్రిలో తనతో ఉన్న కుటుంబసభ్యులను ఆరా తీసింది. ఆస్పత్రి సిబ్బందిని విచారించినా ఎక్కడా బిడ్డ కనిపించకపోవడంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పసిబిడ్డ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. సుమారు 40 ఏళ్లున్న ఓ మహిళ బిడ్డను మాయం చేసినట్టు గుర్తించారు. సీసీ ఫుటేజ్లో పసికందును ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు సంతపేటకు చెందిన షబానా.. సోమవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐతే ఇవాళ తెల్లవారుజాము 5 గంటల నుంచి బిడ్డ కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబసభ్యులు. పసికందు మాయమైన విషయం తెలుసుకున్న షబానా బంధువులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ ఆందోళనలకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక రెండ్రోజుల క్రితం విశాఖలో మాయమైన చిన్నారి కథ సుఖాంతమైంది. శ్రీకాకుళంలో ఇద్దరు మహిళా కిడ్నాపర్లను గుర్తించిన పోలీసులు వారి దగ్గరి నుంచి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తాజాగా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మరో పసికందు మాయమవడం సంచలనంగా మారింది.