చిత్తూరు జిల్లాలోని హోటళ్లలో రోజురోజుకూ ఆహార పదార్థాల ధరలు పెంచేస్తున్నారు. దానికి తగినట్లు నాణ్యత, శుభ్రత పాటిస్తున్నారా అంటే లేదనే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా మాంసాహారాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుల తరబడి ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన మాంసాన్ని ఉపయోగిస్తున్నారు. చికెన్, మటన్ లో ఇతర జంతువుల మాంసాలను కలుపుతున్నట్లు గతంలో పలు సందర్భాల్లో వెలుగు చూశాయి . ప్రజల ఆరోగ్యంతో హోటళ్ల యాజమాన్యాలు చెలగాటమాడుతున్నా నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలున్నాయి. దీనికితోడు అనుమతి లేని హోటళ్లు, దుకాణాలు చాలావరకు ఉన్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో వందల సంఖ్యలో హోటళ్లు, బిర్యానీ సెంటర్లు డాబాలు ఉన్నాయి. వీటిలో అధిక భాగం మాంసాహార హోటళ్లే ఉన్నాయి. ప్రస్తుతం చికెన్, మటన్ ధరలు ఎక్కువగా ఉండడంతో తక్కువ ఖర్చుతో అధిక లాభం పొందేందుకు హోటల్ యాజమాన్యాలు కల్తీలకు పాల్పడుతున్నాయి. రోగాలతో కూడిన మాంసాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుతున్నాయి. మాంసాన్ని నాలుగు రోజులు కుళ్లబెట్టి వాటికి రసాయన ప్రధాన పదార్థాలు కలిపి విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఎటువంటి మాంసపు పదార్థమైన 10 గంటలు దాటితే దుర్వాసన రావడం ఖాయం. అలా వాసన రాకుండా మాంసపు పదార్థాలను పసుపులో ఉడకబెట్టి, ఐసు పదార్థాలతో ఉంచుతున్నారు. ఇలా చేయడంతో బ్యాక్టీరియా వాటిపై చేరి లోపల మాంసం పదార్థాలను కుళ్లిపోయే విధంగా మారుస్తుంది. వీటిని అధిక మోతాదులో ఉన్న రసాయన, మసాలా పదార్థాలను కలిపి వినియోగదారుడికి విక్రయిస్తున్నారు.
ఆరోగ్య భద్రత అధికారులు ఉన్నట్టా.. లేనట్టా...?
చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో వందల సంఖ్యలో హోటళ్లు, మాంసం విక్రయ కేంద్రాలు, రోడ్డు పక్కన నూనెలో వేయించి అమ్మకాలు జరిపే దుకాణాలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు కొనుగోలు చేసి వాటిని కుటుంబ సమేతంగా ఆరగించే పరిస్థితులున్నాయి. అయితే నగరపాలక సంస్థ పరిధిలో విక్రయిస్తున్న మాంసపు పదార్థాలకు ఎలాంటి గ్యారెంటీ లేదు. చికెన్ తో తయారు చేసిన వంటకాలు ఎలాంటి పరిస్థితుల్లో అమ్మకాలు చేశారో కాస్త సులువుగా తెలుసుకోవచ్చు.
అయితే మటన్ తో చేసిన వంటకాలు ఏ విధంగా తయారు చేశారు తెలుసుకోవడం చాలా కష్టం. ఎలాంటి మాంసాన్ని వాడారు అనే విషయం తెలుసుకోవాలంటే ల్యాబ్ ద్వారానే అది సాధ్యమవుతుంది. ఇటీవల కాలంలో చెన్నై, బెంగళూరు రాష్ట్రాలకు తిరుపతి మీదుగా కుక్క, పిల్లి మాంసం ఎగుమతి అవుతోందని సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టి పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఆరోగ్య భద్రత శాఖ అధికారులు మామూళ్లకు ఆశపడి ఎక్కడ కూడా హోటల్ దుకాణాల్లో తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. దీంతో హోటళ్ల యాజమాన్యాలు ఆడింది ఆటగా.. పాడింది పాటగా మారిపోయింది.
ప్రతి హోటల్ నుంచి మామూళ్లు....?
నగరపాలక సంస్థ పరిధిలో ఆహార భద్రత శాఖ అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే జిల్లా స్థాయిలో నాణ్యత ప్రమాణాలు హోటల్లో పాటించే విధంగా ఫుడ్ అండ్ సేఫ్టీ ప్రత్యేక డిపార్ట్మెంట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కనీస బాధ్యత మరిచిన అధికార యంత్రాంగం ఒకవైపు హోటల్ నిర్వాహకులు కలీ మాంసంతో విక్రయాలు బహిరంగంగా సాగిస్తున్న పట్టించుకున్న పాపానపోవడం లేదు. మరో వైపు నగదు వెచ్చించి కొనుగోలు చేసిన ఆహారంతో వినియోగదారులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. చేసేదిలేక... ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆస్పత్రుల వెంబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.