కృష్ణా జిల్లా: ప్రభుత్వ మద్యం విధానం, కల్తీ సారా చావులపై తెలుగు తమ్ముళ్లు కదంతొక్కారు. ఏపీలో మద్యం షాపులన్నీ జే బ్రాండ్తో నిండిపోయాయని తెదేపా ఎమ్మెల్సీ గన్నవరం నియోజకవర్గం ఇన్చార్జి బచ్చుల అర్జునుడు వ్యాఖ్యానించారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న మద్యం దుకాణం ఎదుట టీడీపి శ్రేణులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అర్జునుడు మీడియాతో మాట్లాడుతూ. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ పేద వారి నిండు నూరేళ్ళ ప్రాణాలను 30, 40 ఏళ్లకే చనిపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలోలేని ప్రాణాంతక మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే దాపురించిందన్నారు.
రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం ఆగిపోతే గాని కల్తీ మద్యం చావులు ఆగవని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెలిపారు. పేదోళ్ల ప్రాణాలకు విలువలేదని, మహిళల గౌరవానికి స్థానం లేదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించడం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడు ఆత్మగౌరవంతో బతకాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు రావాలని అర్జునుడు పేర్కొన్నారు.