అడవికి నిప్పు.. అది మనకే ముప్ప అన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. చెట్లు లేకుంటే మనకు ప్రాణవాయువూ లేనట్టే అనే నిజాన్నీ అర్థం చేసుకోవాలి. లేదంటే, మనిషి మనుగడకే ప్రమాదమని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. నిర్లక్ష్యం వహిస్తే అది మనందరి జీవితాలనూ హరిస్తుందన్న భయం ఉండాలి. ఆ సామాజిక స్పృహ మనకు లేదంటే సమస్త జీవకోటికీ ముప్పు ముంచుకొస్తుందని తెలిసుండాలి.
కలకడ మండలం, కోటగుడిబండ పంచాయతీ, ఎల్లమ్మ గుడి బండ సమీపంలోని అడవి అగ్నికి ఆహుతౌతోంది. ఎవరో ఆకతాయీలు అడవికి నిప్పు పెట్టారు. దాంతో అగ్ని కీలలు అడవినంతటా వ్యాపిస్తున్నాయి. ఆ మంటల్లో చెట్లు, పక్షులు, జంతువులు, కీటకాలు కాలి నుసై పోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అటవీ ప్రాంతమంతా మంటల్లో మసై పోతుండడంతో పశువులకు మేతా కరువౌతోంది. కనీసం అటవీశాఖ అధికారులైనా స్పందించి, నిప్పు నుంచి అడవికి ముప్పు లేకుండా, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించి, మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అంటున్నారు.