సాధించాలన్న పట్టుదల ఉండాలే కానీ దానికి వయసు అడ్డం కాదని నిరూపించే ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా, అనంతపురానికి చెందిన వి.సత్యనారాయణరెడ్డి దానిని మరోమారు నిరూపించారు. 64 ఏళ్ల వయసులో గేట్ పరీక్ష రాయడం ఒక ఎత్తైతే అందులో జాతీయ స్థాయిలో 140వ ర్యాంకు సాధించడం మరో విశేషం. ఇప్పుడాయన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్), రిమోట్ సెన్సింగ్ కోర్సులో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, బాంబే ఐఐటీలో చేరాలా? లేదంటే, రౌర్కెలా ఐఐటీలో చేరాలో అనే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సత్యనారాయణరెడ్డి పంచాయతీరాజ్శాఖలో 39 సంవత్సరాలపాటు ఇంజినీరుగా పనిచేసి 2018లో రిటైరయ్యారు. 2019లో జేఎన్టీయూలో సివిల్ విభాగంలో ఎంటెక్లో చేరి ఈ ఏడాది పూర్తిచేశారు. ఆ తర్వాత ‘గేట్’ రాసి జియోమోటిక్స్ ఇంజినీరింగ్ పేపర్లో జాతీయ స్థాయిలో 140వ ర్యాంకు సాధించారు. 64 ఏళ్ల సత్యనారాయణరెడ్డికి ఇద్దరు కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. గేట్లో ర్యాంకు సాధించిన తనకు ఉన్నత విద్యలో ప్రవేశానికి మూడేళ్ల సమయం ఉంటుందని, కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం బాంబే లేదంటే రౌర్కెలా ఐఐటీలో చేరుతానని సత్యనారాయణరెడ్డి తెలిపారు.
![]() |
![]() |