విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను నిరసిస్తూ ఈనెల 28న విశాఖపట్నం నగర బంద్ కు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారానికి 400వ రోజుకు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా పోరాట కమిటీ నేతలు విలేకరులతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నగర బంద్ కు ప్రజలు, రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని కోరారు. త్వరలోనే 100 మంది ఎంపీల సంతకాలతో ఢిల్లీకి వెళ్లి పోరాడుతామని, వారంరోజులపాటు అక్కడే ఉండి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.