ఏపీలోని విజయవాడకు చెందిన కొడాలి ప్రశాంత్, మాధవిల కుమార్తె గీతిక అమెరికా అండర్-19 మహిళా జట్టు కెప్టెన్ గా ఎంపికైంది. బౌలింగ్ ఆల్రౌండరైన గీతిక 14 ఏళ్లకే అమెరికా మహిళా క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకుంది. 17 ఏళ్ల గీతిక ప్రస్తుతం అండర్-19 జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. కెప్టెన్ గా తొలి సిరీస్లోనే విజయాన్ని అందుకుంది. 11 ఏళ్లపుడు మొదటిసారి క్రికెట్ బ్యాట్, బాల్ పట్టుకున్న గీతిక 14 ఏళ్ల వయసులో అమెరికన్ మహిళా జట్టులో స్థానం సంపాదించింది. కెనడా, మెక్సికో, జింబాబ్వే తదితర దేశాల్లో 20 మ్యాచ్లు ఆడానని గీతిక వివరించింది. తను క్రికెట్లో అడుగుపెట్టాక తన తల్లిదండ్రులు మంచి సౌకర్యాలు ఉంటాయని కాలిఫోర్నియా నుంచి నార్త్కరోలినా నివాసం మార్చారని తెలిపింది.
గీతిక కెప్టెన్సీలో 15 మందితో కూడిన అండర్-19 జట్టు తొలి పర్యటనలో భాగంగా కరేబియన్ దీవుల్లోని సెయింట్ విన్సెంట్ వెళ్లింది. అక్కడ 4 మ్యాచ్లలో 3 గెలిచింది. దీంతో గీతికను అక్కడి క్రికెట్ వర్గాలు ప్రశంసించాయి. మే నెలలో దుబాయ్లో జరిగే ఫెయిర్బ్రేక్ టోర్నమెంట్కు ప్రస్తుతం ఈ జట్టు సిద్ధమవుతోంది. ప్రస్తుతం గీతిక 12వ తరగతి చదువుతోంది. మహిళల బిగ్బాష్ లీగ్, ఇండియాలో ప్రారంభం కాబోయే మహిళల ఐపీఎల్లో ఆడటం, ప్రపంచకప్లో అమెరికా మహిళా జట్టుకి కెప్టెన్సీ వహించాలన్నవి తన లక్ష్యాలని చెబుతుంది.