ఆంధ్ర రాష్ట్ర అవతరణకోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి లోక్ సత్తా పార్టీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆకుల దామోదర రావు, జాతీయ వినియోగదారుల హక్కుల సంరక్షణ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి దాసరి సురేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణకోసం 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన మరణాలు కల్తీ సార వలన కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు భావిస్తే శాసనసభ వేదికగా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆకుల దామోదర రావు కోరారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు తిట్టుకుంటూ విలువైన అసెంబ్లీ సమావేశాల సమయాన్ని వృధా చేస్తున్నారని, కల్తీ సారా మరణాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే బాధ్యతగా సమాధానం చెప్పవలసిన మంత్రులు అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేస్తూ సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడిన మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వం లాభాపేక్ష లేదని చెబుతూనే మద్యం అమ్మకాలు ఈ సంవత్సరం 16500 కోట్ల రాబడికి ప్రణాళికలు ఎలా సిద్ధం చేసారని ప్రశ్నించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మధ్య నిషేధం కాకుండా కఠినమైన మధ్య నియంత్రణ చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని, రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. జరిగిన మరణాలపై నానా యాగి చేసే బదులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి ఆదుకోవాలని లోక్ సత్తా పార్టీ నుండి కోరుతున్నాం అని అన్నారు.