పోలవరం పెండింగ్ అంశాల పరిష్కారమే లక్ష్యంగా... కేంద్ర జలశక్తిశాఖ కార్యాలయంలో నేడు కీలక భేటీ ఏర్పాటుచేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన హాజరుకాకున్నా... కేంద్ర జలశక్తిశాఖ ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అథారిటీ CEO, సభ్య కార్యదర్శి హాజరవుతారు. ఈ భేటీ కోసం రాష్ట్ర జలవనరులశాఖ ఉన్నతాధికారులు, పోలవరం అధికారులు, ఇంజినీర్లు మంగళవారం రాత్రే దిల్లీకి చేరుకున్నారు. కేంద్ర జలసంఘం సభ్యులు, జలవిద్యుత్ పరిశోధన కేంద్రం నిపుణులు, CSMRS నిపుణులు, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు హాజరవుతున్నారు. ప్రాజెక్టు పనులు వేగంగా సాగాలంటే నిధుల సమస్య పరిష్కారంతోపాటు... ఆకృతులు ఆమోదం పొందాల్సి ఉంది. అవసరమైన ఆకృతులను ఆమోదిస్తే, పనులు త్వరగా పూర్తిచేస్తామని పోలవరం పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి షెకావత్ కు గుత్తేదారు తెలిపారు. అలాగే ప్రాజెక్టు DPR-2 ఇప్పటికీ ఆమోదం పొందలేదు. సవరించిన అంచనాల కమిటీ సిఫార్సు మేరకు 47వేల 725 కోట్ల వరకు... కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ పెట్టుబడి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రతి 15రోజులకోసారి బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.