ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 02:37 PM

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రవేశపెట్టారు. ఈ కొత్త రూలింగ్ ప్రకారం.. సభలో ఎవరైనా సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డుపడితే వారు సస్పెండ్ అవుతారు. మంగళవారం (మార్చి 15) ఏపీ అసెంబ్లీలో సభను హుందా నడిపేందుకు కొత్త రూల్ తీసుకొచ్చినట్టు గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంగా శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో సభా కార్యాకలాపాలకు అడ్డుపడిన టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇదే ప్రతిపాదనను అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు తెరపైకి తెచ్చారు.


టీడీపీ ఎమ్మెల్యేలు పదేపదే సభను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయ్యాక ఐదుగురు ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ఉండి తమ నిరసనను కొనసాగించారు. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. మార్షల్స్‌తో సభ నుంచి వారిని బయటకు పంపించారు. అనంతరం మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా సభలో నినాదాలు చేయసాగారు.సోమవారం (మార్చి 14) కూడా ఏపీ అసెంబ్లీలో ఐదుగురు సభ్యులన్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. వీరిపై బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేశారు. తాజాగా అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేల్లో నిమ్మకాయల చినరాజప్ప, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్‌, గొట్టిపాటి రవికుమార్‌, ఆదిరెడ్డి భవాని, గణబాబు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌, ఎం. రామరాజు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌లు ఉన్నారు.


 


అంతకుముందు ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలతో హోరెత్తింది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి స్థానికులు చనిపోయారంటూ టీడీపీ చర్చకు పట్టుబట్టింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టేశారు. నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ వెంటనే సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమైనా టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గకుండా తమ నిరసనల్ని కొనసాగించారు.


 


ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని సీఎం వైఎస్‌ జగన్‌ హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, 55వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా కాస్తారా? నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే నమ్మే విధంగా ఉండాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com