ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని ఖండిస్తూ ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి సమాయత్తమవుతున్నామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. విలీన ప్రక్రియతో 35 వేల ప్రాథమిక పాఠశాలల పరిస్థితి ఇబ్బందికరంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేసే విద్యారంగ సంస్కరణలు మంచివైతే సమావేశాలు నిర్వహించి, చర్చించి అమలు చేయాలని డిమాండు చేశారు. అలా కాకుండా దొడ్డిదారిన ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రాథమిక పాఠశాలల వ్యవస్థను కొనసాగించడమే తమ ప్రధాన డిమాండని చెప్పారు. శాసన మండలి సభ్యుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల ఆకాంక్షలకు తగిన ప్రస్తావన లేదని పేర్కొన్నారు. అశుతోష్ మిశ్ర కమిటీ నివేదిక బహిర్గతమైన తరువాత పీఆర్సీ, సీపీఎస్పై ఎలాంటి ప్రస్తావన లేదని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగితే విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.