పశ్చిమగోదవారి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటు సారా మృతుల కుటుంబాలను. నేడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించనున్నారు. చనిపోయిన వారికి నివాళి అర్పించనున్న చంద్రబాబు. బాధిత కుటుంబాలకు ధైర్యంగా ఉంటామనే భరోసా కల్పించనున్నారు. ఇందుకోసం కాసేపటి క్రితమే చంద్రబాబు జంగారెడ్డిగూడెం బయల్దేరారు. ఇప్పటికే సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు మండిపడ్డారు. కల్తీసారా కారణంగా బాధితులు చనిపోతున్నారని...అయినా ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వివిధ వార్డుల్లో 18 మంది మృతిచెందారని..., మరణాలపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న భయాందోళనలను పోగొట్టాలన్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం వేగంగా స్పందించడం లేదని మండిపడ్డారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని పర్యటనలో డిమాండ్ చేయనున్నారు.