కృష్ణా జిల్లా: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ విద్యార్థి, నిరుద్యోగ, యువజన సంఘాలు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. యువజన సంఘాలు గాంధీనగర్ ధర్నా చౌక లో ఆందోళన చేసేందుకు బయలు దేరిన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గాంధీనగర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఆంక్షలు పెట్టారు. ధర్నా చౌక్ వైపుకు వెళ్లే వాహనాలను తనిఖీలు చేసారు. వివిధ మార్గాల్లో అక్కడకు చేరుకునేందుకు యత్నించిన సంఘాల నేతలను పోలీసులు నిరసన కార్యక్రమాలకు అనుమతిలేదని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేసి వాహనాల్లో వివిధ స్టేషన్లకు తరలించారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నేతలు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం జగన్ మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాక మునుపు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయన్న జగన్ మాటతప్పి మడం తిప్పారని దుయ్యబట్టారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని చెప్పి జగన్ తమ ఓట్లు దండుకున్నారని దుయ్యబట్టారు. మెగా డిఎస్సి ద్వారా 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలనీ, అలాగే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేయాలనీ నిరుద్యోగులు డిమాండ్ చేసారు.