విజయవాడ ధర్నాచౌక్ లో నిరుద్యోగ, యువజన సంఘాలు చేపట్టిన ధర్నాపై పోలీసులు ఉక్కు పాదం మోపారు.ఈనాడు లో వచ్చిన కథనం ప్రకారం, ధర్నా చౌక్ లో భారీగా మోహరించిన పోలీసులు అక్కడికి చేరుకున్న యువతను అడ్డుకొని అరెస్టు చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని.. ఉద్యోగం వచ్చే వరకూ రూ. 5వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ యువజన సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. మెగా డీఎస్సీ ద్వారా 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
విజయవాడకు భారీగా నిరుద్యోగులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చివరి దాకా పోరాడతామని విద్యార్థి సంఘం నాయకులు చెబుతున్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని తెలిపారు. సీఎం జగన్ మాట తప్పి మోసం చేశారని ఆరోపించారు. ఉద్యోగాలపై హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారన్నారు. 2. 35 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విద్యార్థి సంఘం నాయకులు కోరారు.