దంపతుల మధ్య విబేధాలు దారుణ పరిణామాలకు దారి తీస్తున్నాయి. పిల్లలకు పెళ్లయిన స్థితిలో కృష్ణా రామా అంటూ ఉండాల్సిన వారు అనుమానం పేరుతో కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. తాజాగా తన భార్యపై అనుమానంతో కిరాతకుడు ఆమెను అంతమొందించాడు. ఆపై భయంతో పారిపోతూ ప్రమాదానికి గురయ్యాడు. స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని విశాఖ జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడికి చెందిన దారపురెడ్డి రమణ, చిన బుల్లి భార్యాభర్తలు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారికి వివాహాలు అయిపోయాయి. దీంతో వేరే ప్రాంతాలకు వారు వెళ్లిపోయారు. ఇంటి వద్ద రమణ, చినబుల్లి మాత్రమే ఉన్నారు. కొంత కాలంలో భార్యపై రమణ అనుమానం పెంచుకున్నాడు. ఈ కారణంతో తరచూ వేధింపులకు పాల్పడేవాడు. 50 ఏళ్లు దాటినా నిత్యం భార్యను అనుమానంతో హింసించే వాడు. చివరికి గురువారం రాత్రి భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఆవేశంలో కత్తి తీసుకుని విచక్షణా రహితంగా దాడి చేశాడు. కత్తి పోట్లతో ఆమె కన్ను మూసింది. అనంతరం పరుగుపరుగున అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో బావిలో అనుకోకుండా పడిపోయాడు. ప్రాణాలపై తీపితో ఓ కర్ర సాయంతో అలాగే ఉండిపోయాడు. అతడి కేకలు విన్న స్థానికులు బావి నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రమణను అరెస్టు చేశారు.