వేడుకకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో నందిగామకు చెందిన నవ వధువు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి ఖమ్మం జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన బలవంతపు మధు అతని భార్య సదా (24) కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం చింతల నర్వ గ్రామానికి వేడుకలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై భార్య భర్తలు ఇరువురు మధిర మీదుగా అంబారు పేట గ్రామానికి వెళ్లే క్రమంలో మధిర శివారు రాయపట్నం సమీపంలో దీపావళి బాంబుల కేంద్రం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం కింద పడిపోవడంతో వెనకాల కూర్చున్న ఉన్న సదాకు తలకు బలమైన గాయాలు అయ్యాయి.
ప్రమాద సంఘటనను చూసిన స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి గాయపడిన వీరిని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వీరిని పరీక్షించిన వైద్యురాలు మనోరమ సదా మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి గత నెల 14న వివాహం అయింది. ఇరు కుటుంబాలది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నందిగామ ప్రాంతమే. వీరికి మధిరలో బంధువులు ఉండడంతో తిరుగు ప్రయాణంలో బంధువులంతా ఇక్కడ కొద్దిసేపు ఆగిన క్రమంలో వీరిరువురు బయలుదేరి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నవ వధువు మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బంధువుల మృతురాలి తల్లిదండ్రుల రోదనలు ఆసుపత్రిలో మిన్నంటాయి. ప్రమాద సంఘటనకు సంబంధించి మధిర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.