వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఢీకొట్టేందుకు సినీ నటి వాణి విశ్వనాథ్ సిద్ధమైంది. నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తనకు వేలాది మంది అభిమానులు ఉన్నారని, వారి కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు నటి వాణీ విశ్వనాథ్ వెల్లడించారు.నగరికి వచ్చిన వాణీ విశ్వనాథ్ కు స్థానిక మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, నగరి నియోజకవర్గంలో తనకు వేలాది మంది అభిమానులు ఉన్నారని చెప్పారు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తాననే విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయడం మాత్రం ఖాయమని కుండబద్ధలు కొట్టారు వాణి. తమ మేనేజర్ రామనుజం చలపతికి రాజకీయంగా జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేకనే.. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడినట్టు వాణీ విశ్వనాథ్ వెల్లడించారు. నలుగురికి సాయం చేసే వ్యక్తి ఇలా ఇబ్బందుల పాలైతే సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోననే ఆందోళనతోనే.. నగిరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.
నగరిలో తన అమ్మమ్మ నర్సుగా పనిచేశారని, ఈ ప్రాంత వాసులు తనకు సుపరిచితులని వాణీ విశ్వనాథ్ చెప్పారు. నగరిలో తమిళ సంస్కృతి ఉందని, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని వివరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా సిద్ధమని ప్రకటించారు.
అవసరమైతే ఇండిపెండెంట్గా సైతం పోటీ చేయడానికి సిద్ధమేనని వెల్లడించారు. నగరిలోని ఒకటో వార్డులోని సామాలమ్మ ఆలయం వద్ద మహిళలు వాణీ విశ్వనాథ్కు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే ఒకప్పటి పాపులర్ హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న వాణీ విశ్వనాథ్ కుటుంబం నుండి మరొకరు చిత్రసీమలోకి అడుగుపెట్టారు.
ఆమె సోదరి కుమార్తె వర్షా విశ్వనాథ్ 'రెడ్డి గారింట్లో రౌడీయిజం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రమణ్ హీరోగా కె. శిరీషా రమణారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఎం. రమేశ్, గోపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. 'రెడ్డి గారింట్లో రౌడీయిజం' మూవీలో పక్కింటి అమ్మాయిని తలపించే పాత్రను వర్ష చేసింది.