వైసీపీ వేయి రోజుల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాజప్ప, నక్కా ఆనందబాబు, దీపక్ రెడ్డి, అశోక్ బాబు.వేయి రోజుల పాలన.. వేయి తప్పిదాలు అంటూ ఛార్జ్ షీట్ విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. సీఎం జగన్ 1000 రోజుల పాలనలో వెయ్యి తప్పులంటూ టీడీపీ పుస్తకం విడుదలయింది. విధ్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట ప్రజా ఛార్జ్ షీట్ విడుదల చేసింది.అశుభంతో పరిపాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ ఒక్కరే. సమస్యల పరిష్కారానికి నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు. ప్రాంతీయ విద్వేషాల కోసమే 3రాజధానులు నిర్ణయం తీసుకున్నారు. 3 రాజధానుల నిర్ణయంతో 135 సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. రూ. 2 లక్షల కోట్ల సంపద అమరావతిని చంపేశారు.
ఎప్పుడూ లేని విధంగా దేవాలయాలపై దాడులకు తెగపడ్డారు. మూడేళ్ల జగన్ పాలనలో అన్నీ నేరాలు ఘోరాలే. సొంత బాబాయి వివేకాతో పాటు కోడెల, మాస్క్ అడిగిన వైద్యుడు సుధాకర్ ఇలా ఎంతోమంది చావులకు ఈ ప్రభుత్వమే కారణం అన్నారు అచ్చెన్నాయుడు. కక్షసాధింపు కోసమే జగన్ అధికారంలోకి వచ్చాడన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప. రాష్ట్రంలో సీఎం జగన్ చేసిన దాడులకు ఎన్నో పరిశ్రమలు తరలిపోయాయి. ఎస్సీ, ఎస్టీలపై మునుపెన్నడూ లేని విధంగా దాడులు చేశారు. దాడులు, కిడ్నాపులు బెదిరింపులతో స్థానిక సంస్థల ఎన్నికల్ని అపహాస్యం చేశారని సొంత కంపెనీ సిమెంట్ ధరలు పెంచేందుకు ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు చినరాజప్ప.
వెయ్యి రోజులుగా వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిన ప్రభుత్వ నిర్ణయాలు.. రైతుల్ని మానసిక వేదనకు గురిచేస్తూనే ఉన్నాయి. రైతులకు ధాన్యం బకాయిలు సకాలంలో చెల్లించకుండా నెలలు తరబడి పెండింగులో పెడుతున్నారు. జగన్ పాలనలో పోలవరం ప్రశ్నార్డకమైంది.వెయ్యి రోజుల్లో ఒక్క బోర్ వెల్ కూడా రైతులకు ఉచితంగా వెయ్యలేదు. నిరాటంకంగా 9గంటల విద్యుత్ ఇవ్వకపోగా, లాలూచీ కోసమే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలను దళారీ కేంద్రాలుగా మార్చారని విమర్శించారు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.