విజయవాడ బహుళ అంతస్తుల కోర్టు భవనం ప్రహరీ నిర్మాణాలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అసౌకర్యం పేరుతో పోలీసులు, అధికారులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.నిజంగానే అసౌకర్యం ఉంటే కోర్టునే మూసేయాలని వ్యాఖ్యానించింది. నిర్మాణాల్ని అడ్డుకోవడంపై వివరణ ఇవ్వాలని ఆర్అండ్బి, పోలీసులను ఆదేశిస్తూ చీఫ్ జస్టిస్ పికె మిశ్రా, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది. నిర్మాణ పనుల్ని అడ్డుకోవం లేదని ఎజి చెప్పారు. అడ్డంకులు లేకుండా తీసుకునే చర్యలను వివరించాలని హైకోర్టు ఆదేశించి, విచారణను 21కి వాయిదా వేసింది.
నిందితుడిని రిమాండ్కు తరలించే ఉత్తర్వులు ఇచ్చే మేజిస్ట్రేట్లు చట్ట ప్రకారం కారణాల్ని నమోదు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రిమాండ్ ఉత్తర్వులు చట్ట ప్రకారం లేనట్లు తేలినా, ఎవరైనా నిందితులు తమకు తెలిపినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని చీఫ్ జస్టిస్ పికె మిశ్రా, జస్టిస్ ఎవి శేషసాయితో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.
మీడియా వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఏకపక్షంగా కేసులు పెడుతున్నారని టివి 5 న్యూస్ ఛానెల్ అధినేత బొల్లినేని రాజగోపాల్ నాయుడు పిల్ దాఖలు చేశారు. ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారని, ఎఫ్ఐఆర్ను 24 గంటల్లో అప్లోడ్ చేయడం లేదన్న పిల్లో హైకోర్టు తీర్పు చెప్పింది.