ఓ మహిళతో నిందితుడికి పరిచయం ఏర్పడింది. చనువుగా మాట్లాడుతుంటే తనంటే ఇష్టమని భావించాడు. కోరిక తీర్చమంటే సదరు మహిళ తిరస్కరించింది. ఎంతగానో వెంటపడ్డా కాదని చెప్పింది. దీంతో పగతో రగిలిపోయిన కామాంధుడు ఆ మహిళను దారుణంగా హత్య చేశాడు. మహిళ మృతదేహం చూసిన పోలీసులు సైతం ఆ దృశ్యం చూసి చలించిపోయారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణానికి చెందిన మహిళకు పొందూరు మండలం గోకర్లపల్లి గ్రామానికి చెందిన సీపాన మహేష్కు పరిచయం ఏర్పడింది. ఆ మహిళ తనతో నవ్వుతూ మాట్లాడుతుంటే మహేష్ అపార్థం చేసుకున్నాడు. ఓ రోజు ఆమెను కోరిక తీర్చమని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించింది. తరువాత ఎప్పటిలాగానే మామూలుగా మాట్లాడేవాడు. ఈ నెల 4వ తేదీన ఆమెతో మహేష్ ఫోన్లో మాట్లాడాడు. తన స్కూటీని మహిళ ఇంటికి దూరంగా ఉంచాడు. అక్కడి నడుచుకుంటూ మహిళ ఇంటికి వెళ్లాడు. మరోసారి తన మనుసులోని కోరికను బయటపెట్టాడు.
ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. పక్కనే కుట్టుమిషన్ కత్తెరను చేతిలోకి తీసుకుని ఆమె శరీరంపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అది గమనించిన నిందితుడు మహిళ నోటిని మూసేశాడు. ఇరుగుపొరుగు వారు ఇంటి బయటి నుంచే ఏమైందని అడిగి వెళ్లిపోయారు. వారు అలా వెళ్లగానే మరింత దారుణంగా పొడిచి మహిళ ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తన శరీరానికి రక్తం అంటుకోవడంతో ఆమె ఇంట్లోనే తీరిగ్గా స్నానం చేసి తిరిగి వెళ్లిపోయాడు. ఈ దారుణమంతా పగలే జరిగింది. రాత్రైనా ఆమె తలుపు తీయకపోవడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి చూశారు. రక్తపు మడుగులో ఆమె పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ పైడయ్య, పోలీసులు విచారణ ముమ్మరం చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.