పచ్చిమ ప్రకాశం ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వేసవికాలం సమీపిస్తుండటంతో చెరువులు, నీటి కుంటలు, చెక్ డ్యామ్ లలో నిలువ ఉన్న నీరు వేగంగా అడుగంటుతుంది.
గతంలో పచ్చిమ ప్రకాశం ప్రాంతంలో భూగర్భ జలాలు భారీగా పతనమై స్థానిక ప్రజలతో పాటు రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు సంవత్సరాల కాలం వెనక్కి వెళితే.. కనీసం 1000 అడుగులు లోతుకు బోరు వేస్తే కానీ నీరు వచ్చే పరిస్థితి కనిపించేది కాదు.
రెండు సంవత్సరాల నుంచి మంచి వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో స్థానిక ప్రజలు, రైతులు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు.
ముఖ్యంగా ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, మార్కాపురం ప్రాంతాలలో భూగర్భ జలాల సమస్య గత 15 సంవత్సరాల నుంచి ఉంది. ఈ ప్రాంతంలో వర్షాలు అంతంత మాత్రమే కావడంతో నీటిలో అధిక ఫ్లోరైడ్ వస్తూ స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసింది.
అంతేకాకుండా వర్షాలు సరిగా పడకపోవడం వల్ల భూగర్భ జలాలు కూడా అంతంతమాత్రంగానే కావడంతో వ్యవసాయం కూడా ఈ ప్రాంతంలో కుంటుపడింది.
కానీ గత మూడు సంవత్సరాలుగా ఓ మోస్తరు వర్షాలు పడుతుండడంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఓ మోస్తరుగా పెరుగుతూ వచ్చాయి. కానీ మళ్లీ గర్భ జలాలు అడుగంటి పోతూ ఉండడంతో స్థానిక ప్రజలు, రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందులో వేసవి సమీపిస్తుండడంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చెరువులలో ఓ మోస్తరుగా నీటి జలాలు ఉన్నా వాటిని సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనపై ఉందని స్థానిక ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వేసవికాలంలో నీటి ఎద్దడిని ఎదుర్కోవాలంటే నీటిని సంరక్షించుకోవడం వల్ల అది సాధ్యమవుతుందని స్థానిక ప్రజల తోపాటు రైతులు పేర్కొంటున్నారు.