తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. అయితే అటువంటి సూక్తులేవీ తనకు అక్కర్లేదనుకున్నాడో యువకుడు. మద్యం మత్తులో మానవత్వం మరిచాడు. చెల్లెలని కూడా చూడకుండా క్షణికావేశంలో దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలి పని చేస్తుంటాడు. అన్నను చూసేందుకు తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెం నుంచి ఆయన చెల్లి సోమమ్మ(30) వచ్చింది. ఎలాగో ఆడపడుచు ఉందనే ఉద్దేశంలో పుట్టింటికి వెళ్లి, రెండు రోజులు ఉండి వస్తానని నంద భార్య తెలిపింది. ఆమె వెళ్లగానే గురువారం రాత్రి నంద బాగా మద్యం తాగాడు. చికెన్ తీసుకొచ్చి, అప్పటికప్పుడు కూర వండాలని చెల్లెలు సోమమ్మకు సూచించాడు. తనకు ఆరోగ్యం బాగాలేదని, ఈ వేళలో కూర ఏంటని సోమమ్మ అనింది. తాను బయటకు వెళ్తున్నానని, తిరిగొచ్చే లోపు కూర వండేయాలని నంద హుకుం జారీ చేశాడు.
ఫుల్లుగా మద్యం తాగిన నంద, తిరిగి శుక్రవారం తెల్లవారు జామున ఇంటికి వచ్చాడు. కోడి కూర ఎందుకు వండలేదని చెల్లితో గొడవ పడ్డాడు. పట్టలేని ఆగ్రహంతో ఆమెపై దాడి చేశాడు. ఆమె బయటకు పారిపోతూ గట్టిగా కేకలు పెట్టింది. అయినప్పటికీ వదిలిపెట్టకుండా వెంటపడి, గొడ్డలితో కిరాతకంగా హత్య చేశాడు. ఇరుగుపొరుగు వారు నిందితుడిని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.