ఆ బస్సులో ప్రయాణికులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు మహిళ. దీంతో ఆమెపై డ్రైవర్ కన్నేశాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బస్సు నడిపే బాధ్యతను వేరే డ్రైవర్కు అప్పగించాడు. ఆ కీచకుడు బస్సు వెనుక భాగంలో విశ్రాంతి తీసుకుంటున్న మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన ప్రయాణికుడిపైనా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. చివరికి బాధితురాలు భర్తకు ఫోన్ చేయడంతో, ఆయన స్పందించి ఆర్టీసీ ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చాడు. బస్సు దిగిన వెంటనే బాధితురాలిని వారు రక్షించి, సదరు ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బుధవారం అర్థరాత్రి నెల్లూరు నుంచి విశాఖపట్నానికి ఇంద్ర ఆర్టీసీ బస్సు బయల్దేరింది. ఆ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు ఒంగోలుకు వచ్చే సరికి అందులో ఓ మహిళ, మరో ఇద్దరు పురుషులు మాత్రమే మిగిలారు. దీంతో ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసిన డ్రైవర్ జనార్ధన్ బస్సు స్టీరింగ్ బాధ్యతలను మరో డ్రైవర్కు అప్పజెప్పాడు. బస్సు వెనకకు వచ్చి మహిళను అసభ్యకర రీతిలో తాకుతూ ఇబ్బంది పెట్టాడు. ఆమె ప్రతిఘటించకుండా నోరు అదిమిపెట్టి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బస్సు గుంటూరు వచ్చేసరికి ఒక ప్రయాణికుడు దిగిపోయాడు. అప్పుడు ఒక్క ప్రయాణికుడు మాత్రమే ఉన్నాడు.
డ్రైవర్ మరోసారి తన వద్దకు రాగా ఆమె కేకలు వేస్తూ, తోటి ప్రయాణికుడి సాయం కోరింది. నిలదీసిన ఆయనపైనా డ్రైవర్ జనార్ధన్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అనకాపల్లిలోని తన భర్తకు బాధిత మహిళ ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయన విజయవాడలోని తనకు తెలిసిన ఓ వ్యక్తికి ఫోన్ చేసి విషయం వివరించాడు. ఆ వ్యక్తి విజయవాడ బస్టాండుకు చేరుకున్నాడు. అధికారులతో కలిసి బస్సు వచ్చే ప్లాట్ఫామ్పై సిద్ధంగా ఉన్నాడు. బస్సు రాగానే బాధిత మహిళను రక్షించి, బయటకు తీసుకొచ్చారు. డ్రైవర్పై ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆర్ఎం ఎంవై దానం స్పందించారు. వివాదాస్పద డ్రైవర్ స్థానంలో మరో డ్రైవర్ను బస్సులో పంపారు. జనార్థన్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలిని రక్షించిన వ్యక్తి కోరారు.