తెలంగాణలో త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. తాజాగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ఆర్టీసీ సంస్థ గత ప్రతిపాదనను సవరించి కొత్త ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పిస్తోంది. తాజా ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే ఛార్జీలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. పాత ప్రతిపాదన ప్రకారం ప్రజలపై రూ.850 కోట్ల భారం పడనుండగా, కొత్త ప్రతిపాదన ప్రకారం అది రూ.1,200 కోట్ల వరకు ఉండనుందని ఆర్టీసీ వర్గాల సమాచారం. కి.మీ కు 40 పైసల నుంచి 50 పైసల వరకు పెంచేలా తాజా ప్రతిపాదన రూపొందిస్తున్నట్టు తెలిసింది.
డిసెంబర్లోనే కి.మీ.కు ఆర్డినరీ బస్సులపై 25 పైసలు, మిగతా కేటగిరీ బస్సులపై 30 పైసలు పెంచాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ఆర్టీసీ సంస్థ నివేదిక సమర్పించింది. ప్రస్తుతం ఆ ఫైలు సీఎం కార్యాలయంలో ఉంది. ఆర్టీసీ నెలకు 18 కోట్ల నుంచి 20 కోట్ల లీటర్ల డీజిల్ను వినియోగిస్తోంది. డీజిల్ ను చమురు కంపెనీల నుంచి బల్క్గా కొంటోంది. ఈ ఒప్పందం మేరకు రిటైల్ కంటే లీటరుపై రూ.4 వరకు తగ్గింపు పొందుతోంది. ఫిబ్రవరి 16 వరకు ఆర్టీసీకి అందే డీజిల్ లీటరు ధర రూ.91 వరకు ఉంది. 17న అది ఒక్కసారిగా పెరిగి రూ.97కు చేరుకుంది. దీంతో సంస్థ బల్క్ కొనుగోలు ఆపి రిటైల్ గా కొనటం ప్రారంభించింది. ప్రస్తుతం బల్క్ డీజిల్ ధర లీటరుకు దాదాపుగా రూ.104కు చేరుకుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే వచ్చే వారం రోజుల్లో బల్క్ డీజిల్ ధర రూ.112ను దాటే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం బంకుల్లో డీజిల్ ధర రూ.94.62గా ఉంది. యూపీ ఎన్నికలు ముగియగానే ఈ ధర కూడా పెరిగే అవకాశం ఉంది. బల్క్ సరఫరా ధరలను మించిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఆర్టీసీ కచ్చితంగా మళ్లీ బల్క్గా కొనాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీపై ఏటా సుమారు రూ.340 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. అధికారులు రెండు, మూడురకాల కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే ప్రభుత్వానికి అందించి, వీలైనంత వరకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.