హిందువులు ఆరాధించే దేవుళ్లలో పరమశివుడిది ప్రత్యేక స్థానం అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అగ్ర దేవుడిగా పరమశివుడికి భక్తుల గుండెలలో ప్రత్యేక స్థానం ఉంటుంది. భక్తితో శివనామస్మరణ పలకని వారే ఉండరు. శివుని కృపాకటాక్షాలు పొందేందుకు ఋషులు, మునులు ఘోర తపస్సు చేశారంటే మీరే అర్థం చేసుకోవచ్చు పరమశివుడికి ఎంత ప్రాధాన్యత ఉందో.
భారతదేశంలో ఎన్నో ప్రముఖ శివాలయాలు ఉన్నాయి. కొన్ని శివాలయాలు ప్రాచీనం పొందగా మరికొన్ని శివాలయాలు నేటికీ కనుమరుగయ్యే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ప్రాచీనం కలిగిన దేవాలయాలు బయటపడుతూనే ఉన్నాయి. అలానే మన ప్రకాశం జిల్లాలో కూడా ఒక ప్రాచీన శివాలయం వెలుగులోకివచ్చింది. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ శివాలయం అడవి ప్రాంతంలో ఉంది. ఇంతకు ఆ శివాలయం ప్రత్యేకత ఏంటో, ఆ శివాలయం అసలు ఎక్కడ ఉందో ఒక్కసారి ఈ కథనాన్ని చూసేయండి.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పోట్టి రెడ్డి పల్లి గ్రామ సమీపంలోని ఓ ప్రాచీన శివాలయం వెలుగులోకి వచ్చింది. పొదలకుంట పల్లి గ్రామం నుండి రెండు కిలోమీటర్లు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాక రెండు కొండల మధ్య స్వయంభువుగా వెలసిన భృగా మల్లేశ్వరస్వామి శివాలయం కనిపిస్తుంది. చక్కటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఆలయం చూడటానికి చిన్నగా ఉన్నా దీని ఘనచరిత్ర పెద్ద గానే ఉందని చెప్పాలి.
ఈ శివలింగం స్వయంభువుగా వెలసి భృహ మహర్షి ద్వారా పూజింప పడిందిగా స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయానికి కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆలయ సమీపంలో కొండలలో నుంచి వచ్చే నీటి ఊట ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. మండుటెండలు వేసవికాలంలో కూడా ఇక్కడ నీరు ఊట రూపంలో వస్తూనే ఉంటుంది. నీరు కూడా బుగ్గల రూపంలో వస్తుంది కాబట్టే ఇక్కడ భృగ మల్లేశ్వరస్వామిగా ఈ శివలింగానికి పేరు వచ్చింది.
ఇక ఆలయ సమీపంలో ఉండే గుహ నేటికీ మిస్టరీని తలపిస్తుంది. ఈ గుహ నుండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీకి వెళ్లవచ్చని అక్కడి వరకు ఈ గుహ ఉందని పూర్వీకులు చెబుతూ ఉంటారు. గతంలో ఈ గుహ నుంచి వెళ్లిన కొందరు నేటికీ తిరిగి రాలేదు. వారు ఏమయ్యారో నేటికీ వారి సమాచారం తెలియక పోవడం మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ గుహలను సందర్శిస్తుంటారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతుంది.
స్థానికులు ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ కాపాడుకుంటూ వస్తున్నారు. ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ప్రాచీనమైన చరిత్ర కలిగిన ఉన్న శివాలయం వెలుగులోకి రావడం భక్తులు ఆనందించదగ్గ విషయమే. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోదలకుంట పల్లి గ్రామానికి చేరుకోవాలి. తరువాత అక్కడి రెండు కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో నడవడం ద్వారా లేదా ద్విచక్ర వాహనం మీద వెళ్ళవచ్చు. చూడాలనుకునే భక్తులు ఒక్కసారి ఆలయాన్ని చూసేయండి.