జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ప్రజా అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నుంచి వచ్చే అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజ్ఞప్తి చేశారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రక్రియను సజావుగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో సోమవారం విశాఖపట్టణం కలెక్టరేట్ లో జరిగిన రాష్ట్ర స్థాయి స్క్రూట్నీ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. పాలకొండ, రాజాం డివిజన్లు కొత్తగా మన్యం, విజయనగరం జిల్లాల్లో కలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా మెంటాడ ప్రాంత ప్రజల నుంచి నాయకుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని చెప్పారు. మెంటాడను మన్యం జిల్లాలో కాకుండా విజయనగరం జిల్లాలో ఉంచాలని అక్కడ ప్రాంత ప్రజలు కోరుతున్నారని కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. జిల్లాలో వచ్చిన ఇతర అభ్యంతరాలు, సూచనలు, సలహాలు కమిటీకి వివరించారు. పార్వతీపురం జిల్లాకు సంబంధించి భవనాలు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం గురించి తెలిపారు.
సమావేశంలో ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్, సర్వే సెటిల్ మెంట్, లాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, పాడేరు ఐటిడిఎ పిఓ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారులు, విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి ఆర్డీవోలు పెంచల కిషోర్, గోవిందరావు, సీతారామారావు, తదితరులు పాల్గొన్నారు.