భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలే కాలక్రమంలో పెద్ద పెద్ద వివాదాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో తమ జీవిత భాగస్వామిపై అనుమానం పెంచుకుని తమ మనసుల్లో కొందరు విషబీజాలు నాటుతున్నారు. అది పెరిగి పెద్దవుతున్న తరుణంలో అవతలి వారిని హత్య చేసేందుకూ వెనుకాడడం లేదు. ఇదే కోవలో భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను నరికి చంపాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని చవట దళితవాడలో బాలపెంచలయ్య, సీతమ్మ దంపతులు నివసిస్తున్నారు. భార్యపై అనుమానంతో బాలపెంచలయ్య నిత్యం వేధించేవాడు. ఇవి తీవ్రం కావడంతో భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరుగా జీవిస్తున్నారు. అప్పటికీ భార్యపై అనుమానం పోనిచ్చుకోని పెంచలయ్య గురువారం రాత్రి తీవ్రంగా ఘర్షణ పడ్డాడు. ఆగ్రహం పట్టలేక కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమె కేకలు విన్న స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని కటకటాల్లోకి పంపారు.