హైకోర్టులో ఉద్యోగాల పేరుతో ఇటీవల నకిలీ కాల్ లెటర్లు సృష్టించిన నిందితులను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పోలీస్స్టేషన్లో సీఐ దుర్గాప్రసాద్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన యల్లా ఉమామహేశ్వరావు, పోనంగి సత్యసాయి చక్రధర్ మరికొందరు కలిసి హైకోర్టులో ఉద్యోగాల పేరిట నకిలీ నియామక పత్రాలు తయారుచేసి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. వీరు ఎక్కువగా పది, ఇంటర్ చదివిన వారిని లక్ష్యం చేసుకున్నారు. కృష్ణా, పశ్చమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 8 మంది నిరుద్యోగుల నుంచి రూ. 7. 50 లక్షలు తీసుకున్నారు.
భార్గవ్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు అడగ్గా, అనుమానం వచ్చిన అతను తనకిచ్చిన నకీలీ కాల్లెటర్ను హైకోర్డు ఉద్యోగుల దృష్టికి తేవడంతో విషయం వెలుగులో వచ్చింది. హైకోర్టు డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ కె. ఎస్. వి. ప్రసాద్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పోతురాజు ఆదేశాలతో గురువారం నిందితులను మందడం గ్రామ శివారులో సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై శ్రీహరి సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు.
అనంతరం నిందితులను మంగళగిరి అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరచడానికి తీసుకెళ్లారు. నిందతులపై ఐపీసీ 120బి, 467, 468, 471, 420, 66డి ఆఫ్ ఐటీ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై శ్రీహరి, సబ్బందిని డీఎస్పీ వి. పోతురాజు అభినందించారు. ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉంది.