విజయవాడ నగర పాలక సంస్థ వెహికల్ డిపోలో డ్రైవరుగా పని చేస్తున్న ఏలూరి వెంకటేశ్వరరావు (32) తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీతారాంపురం చాపరాల వారివీధికి చెందిన వెంకటేశ్వర రావుకు పదేళ్ల క్రితం అచ్చం పేట మండలం గంధసిరి గ్రామానికి చెందిన సౌజన్యతో వివాహం జరిగింది.
వీరికి ఒక బాబు. అనంతరం మూడు కాన్పులు పోయాయి. నాలుగో కాన్పులో పాప పుట్టినా వెంటనే చనిపోవడంతో సౌజన్య పుట్టింటికి వెళ్లారు. ఇటీవల వెంకటేశ్వరరావు అత్తగారి ఇంటికి వెళ్లి భార్యను కాపురానికి రమ్మని పిలిచినా రాకపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు.
గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి తల్లి దుర్గతో మాట్లాడారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తల్లితో మాట్లాడుతూ తాను చనిపోతే తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలనడంతో తల్లి అతనిని మందిలించి పడుకోమని సూచించారు.
కొద్దిసేపటికి తన గదిలోకి వెళ్లిన కుమారుడిని చూసేందుకు తల్లి వెళ్లగా సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్న స్థితిలో వెంకటేశ్వరరావు కనిపించారు. వెంటనే ఆమె పోలీసు లకు ఫిర్యాదు చేయగా పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.