ఏపీలో సినిమా టికెట్స్ ధరలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ధరల పెంపుపై ఇటీవల జరిగిన చర్చల్లో ప్రభుత్వం సుముఖంగా ఉందని సిని ప్రముఖులు చెబుతున్నా..మరోసారి రగడ మొదలవుతోంది. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా రేపు విడుదల కానుంది. అయితే సినిమా టికెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. ప్రస్తుతం అమలులో ఉన్న టికెట్ ధరలనే కొనసాగించాలని సినిమా హాళ్ల యజమానులకు అధికారులు సంకేతాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.ప్రస్తుతం అమలులో ఉన్న జీవో నెంబర్ 35 ప్రకారమే టికెట్ ధరలు ఉండాలని.. అతిక్రమిస్తే సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ, రాడజమండ్రి, గుంటూరు, అనకాపల్లి, ఏలూరు, మదనపల్లి, గుడ్లవల్లేరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే థియేటర్లను అధికారులు తనిఖీలు చేపట్టారు రెండు రోజుల క్రితమే ఈ టికెట్ కు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉండగా.. మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో జాప్యం జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ రాత్రిలోపు టికెట్ ధరల పెంపుపై జీవో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు రేపు పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ రేపు రిలీజ్ కానుంది. ఏపీలో నిబంధనల మేరకు సినిమా రిలీజ్ అవుతుందని చెబుతుండటంతో పవన్ అభిమానులు బీపీ పెంచుకుంటున్నారు.