ఇటీవల కాలంలో భార్యాభర్తల గొడవలు విపరీత పరిణామాలకు దారి తీస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనస్పర్థలు తలెత్తితే పరిష్కించుకోవాల్సింది పోయి విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. కొందరైతే ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. ఇదే కోవలో ఓ వ్యక్తి భార్యపై అలిగి, చిన్న కారణానికే ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గళ్లకు చెందిన మద్దా రామకృష్ణ(23), ఆశాజ్యోతి భార్యాభర్తలు. మంగళవారం తన భార్యను టీ ఇవ్వమని అడిగాడు. ఇంట్లో పంచదార, టీ పొడి లేవని భార్య సమాధానం ఇచ్చింది. దీంతో చిన్నబుచ్చుకున్న అతడు ఇంట్లోంచి వేగంగా బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆమె కంగారు పడింది. ఇంతలో ఆమె ఫోన్కు వాట్సాప్కు వీడియో వచ్చింది. టీ ఇవ్వలేదని పురుగుల మందు తాగినట్లు భర్త పెట్టిన సెల్ఫీ వీడియో చూసి ఆమె హతాశురాలైంది. హుటాహుటిన భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని, గ్రామస్తుల సాయంతో అక్కడకు వెళ్లింది. వారంతా యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.