ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం హైదరాబాద్లో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తీసుకొచ్చారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు. ప్రస్తుతం ఉదయగిరిలోని మెరిట్ ఇంజినీరింగ్ కాలేజీకి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికా నుంచి మంగళవారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. తండ్రి నిర్జీవంగా ఉండడం చూసి, కన్నీరుమున్నీరయ్యారు. ఇక అభిమానులు, వైసీపీ శ్రేణులు ఆయన మృతిపై కన్నీటి సంద్రం అయ్యాయి. ప్రస్తుతం జొన్నవాడ, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, వాసిలి, నెల్లూరు పాలెం, డీసీ పల్లి, మర్రిపాడు, బ్రాహ్నణపల్లి మీదుగా ఉదయగిరికి అంతిమయాత్ర చేరుకోనుంది. ఉదయగిరిలో జరిగే అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. ప్రస్తుతం మంత్రి అంతిమ యాత్రలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు గోవర్థన్ రెడ్డి, సంజీవయ్యలు పాల్గొన్నారు.