కింది స్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారులు చిందులు తొక్కడం ఇటీవల సర్వసాధారణమైంది. సోషల్ మీడియా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాలు ఎక్కడ జరిగినా అందరికీ తెలుస్తున్నాయి. అయినప్పటికీ కొందరు అధికారుల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా ఏపీలో ఓ మహిళా ఎస్ఐపై ఎమ్ఆర్ఓ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఇటీవల కాలంలో ఇసుక తరలింపు వివాదం నెలకొంది. గోవిందపురం గ్రామస్థులు కందివలసగెడ్డలోని ఇసుకను లంకలపల్లి గుండా ప్రతిరోజూ ఎడ్లబండిలో తరలిస్తుంటారు. ఇసుక తరలింపు కారణంగా తమ గ్రామంలోని బోరుబావులు ఎండిపోతున్నాయని లంకలపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇసుక తరలిస్తున్న ఎడ్లబండ్లను అడ్డుకున్నారు. ఫలితంగా రెండు గ్రామాల ప్రజల మధ్య వివాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ జయంతి అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. అయితే ఆమె మాటలను వారు పట్టించుకోలేదు. అదే సమయంలో ఎమ్ఆర్ఓ కృష్ణమూర్తి అక్కడకు చేరుకున్నారు. వచ్చీరాగానే ఎస్ఐపై చిందులు తొక్కారు. మహిళా ఎస్ఐ అని కూడా చూడకుండా దారుణంగా మాట్లాడారు. ప్రజలను అదుపు చేయలేవని, ఎస్ఐగా పనికి రావని, వెళ్లి గేదెలు కాసుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలతో ఎస్ఐ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఐ విజయకుమార్ స్పందించారు. తహశీల్దార్ వైఖరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.