అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో వన్యజీవులు జనావాసాల్లోకి వస్తున్నాయి. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. పంట పొలాల్లోనూ సంచరిస్తూ.. రైతులు వేసుకున్న పంటలను నాశనం చేస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలంలో ఏనుగు సంచారం బీభత్సం కలిగించింది. పశువుల పాకపై దాడి చేసి, రెండు ఆవులను చంపేసింది. ఇటీవల ఏనుగుల గుంపులో నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు.. పంటపొలాల్లో తిరుగుతున్నట్లు స్థానిక రైతులు గుర్తించారు. ఏనుగుల గుంపు కోసం వెదుకుతూ ఆ గజరాజు పంటపొలాలను నాశనం చేస్తోంది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి గంగిరేగి వలసలో గట్టిగా ఘీంకారాలు చేస్తూ.. భయాందోళన కలిగించింది. పాకలో నిద్రిస్తున్న ఆవుల పై దాడి చేసింది. ఈ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి. ఏనుగు సంచారంతో సమీప గ్రామాల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా క్షణ క్షణం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.