చాలామంది పెంపుడు జంతువులంటే చాలా ప్రేమ కనబరుస్తారు. కొంత మంది కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తారు. వాటికేమైనా అయితే అల్లాడిపోతారు. ఇలా ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో దాన్ని పెంచుకున్న యజమాని కుమిలిపోయాడు. కొన్ని రోజులకే ఏకంగా తన ప్రాణాలను వదిలేశాడు. ఈ విషాదకర ఘటన గురించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం దొమ్మేరులో వరిగేటి శ్రీను అనే వ్యక్తి కొన్నేళ్ల కిందట ఓ కుక్కను తెచ్చుకుని ప్రేమగా పెంచుతున్నాడు. దానికి శ్రీనుకు ఎంతో అనుబంధం ఏర్పడింది. ఇక పెంపుడు కుక్క కూడా యజమాని పట్ల ఎంతో విశ్వాసంగా ఉండేది. ఇలా ఎంతో ప్రేమతో పెంచుకున్న కుక్క ఇటీవల చనిపోయింది. దాని మృతితో శ్రీను చాలా బాధ పడ్డాడు. భోజనం చేయడం కూడా మానేశాడు. చివరికి అది లేని లోకంలో తానుండలేనంటూ ఈ నెల 7న పురుగుల మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.