దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని ఘోరం జరిగింది. ఓ ప్లాట్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృత దేహం లభ్యమైంది. ఆమెను గొంతు నులిమి చంపినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణమైంది. శుక్రవారం (ఫిబ్రవరి 18) రాత్రి వెలుగుచూసిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
బురారీ ప్రాంతంలోని కౌశిక్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లోని ఒక ప్లాట్లో అమన్ తన భార్య ప్రియాంక రావత్తో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లిన ప్రియాంక రావత్ తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు ఫ్లాట్కు చేరుకుంది. ఇంట్లోకి రాగానే మంచంపై యువతి మృతదేహం చూసి షాక్లో ఉండిపోయింది. కాసేపటికి తేరుకుని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగినప్పటి నుంచి మహిళ భర్త అమన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గమనించారు. యువతిని హత్య చేసి అమన్ పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మృతురాలిని నాథుపుర ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించారు. ఆమె తండ్రికి హత్య విషయంపై సమాచారం అందించారు.