అర్ధరాత్రి వంటగదిలో తన భార్యను వేరే యువకునితో అసభ్యకర రీతిలో చూసిన ఓ భర్త వారిని నిలదీశాడు. అలా చేయడమే ఆయన పాలిట శాపమైంది. ఆయనను భార్య, ఆమె ప్రియుడు కలిసి అంతమొందించారు. తన భర్త గుండెపోటుతో చనిపోయాడని నిందితురాలు ఏడ్చింది. అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో గత గురువారం అనుమానాస్పద స్థితిలో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సీఐ నాగేశ్వరరావు హత్యకు దారి తీసిన వైనాన్ని మీడియాకు వెల్లడించారు. మృతుని భార్య లలిత కుమారికి నరసింగరావు అనే వ్యక్తికి ఇటీవల వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం, భర్త లేని సమయంలో కలవడం చేసేవారు. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి కూడా ప్రియుడు ఆమెతో మాట్లాడాడు. కలవాలని ఉందని ఇంటికి వచ్చేశాడు. భర్త పడుకున్నాడని అనుకుని ఆమె వెళ్లి ప్రియుడిని కలిసింది. దాహం వేయడంతో వంటగదిలోకి ఆమె భర్త వచ్చాడు.
అసభ్యకర రీతిలో ఉన్న తన భార్యను చూసి అవాక్కయ్యాడు. భార్యను, ఆమె ప్రియుడుని తిట్టి, వారు చేసింది తప్పని కొట్టాడు. తమ సంబంధం బయటపడడంతో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తను తీవ్రంగా కొట్టారు. చున్నీని మెడకు బిగించి, ఊపిరి ఆడకుండా చేయడంతో అతడు మృతి చెందాడు. అయితే తన భర్త గుండెపోటుతో మరణించాడని నిందితురాలు ఏడ్పులు మొదలు పెట్టింది. ఆమె చెప్పింది నిజమేనని బంధువులంతా తలంచారు. మృతదేహానికి స్నానం చేయిస్తున్న సమయంలో మెడపై దెబ్బల గుర్తులను గమనించి, అనుమానించారు. పోలీసులకు సమాచారం అందించగా, వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో అది హత్యగా తేలింది. ఈ క్రమంలో తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలు కావడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు.