విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన విజయనగరం జిల్లా గుర్లలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కిరాణా వ్యాపారం చేస్తూ జీవనం సాగించే శ్రీనివాసరావు(51) గ్రామ సమీపంలోని అగ్రహారానికి చెందిన రాములు ఆటోలో విజయనగరం మార్కెట్కు వెళ్లారు. కిరాణా సామగ్రి కొనుక్కొని తిరిగి వస్తుండగా అచ్యుతాపురం వద్ద చీపురుపల్లి వైపు నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు బలంగా ఢీకొంది. ఆ ధాటికి ఆటో నుజ్జయి పక్కనున్న చెరువులో పడిపోయింది. అందులో ఉన్న శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవరు రాములును 108 వాహనంలో జిల్లా కేంద్రాసుపత్రికి, అక్కడి నుంచి విశాఖ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.