అనుమానంతో భార్యపై భర్త దాడికి పాల్పడిన సంఘటన పదారుపల్లి జాషువా నగర్ లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. స్థానికంగా ఉంటున్న ఆర్.శ్రీనివాసులు, సత్య దంపతులు. వీరికి 20 ఏళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీనివాసులు ఆటో నడుపు కుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలం కిందట ఆయనకు పక్షవాతం వచ్చి ఒక కాలు, చేయి పనిచేయడం లేదు. దాంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆయన భార్య వంట పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
ఆమె ప్రవర్తనపై భర్త అనుమానం పెంచుకొని ఘర్షణకు దిగేవాడు. శనివారం ఉదయం ఆమెతో గొడవ పడి కళ్లలో కారం కొట్టి చాకుతో ఆమె తలపై, చేతిపై పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వేదాయపాలెం ఇన్ స్పెక్టర్ కె.నరసింహారావు, ఎస్సై మరిదినాయుడు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.