పెళ్లి రోజును సరదా గడిపేందుకు జలపాతం వద్దకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కుమారుడు నీటి ప్రవాహంలో పడి మునిగి పోవటాన్ని గమనించిన తండ్రి తన కుమారుడి రక్షించాడు. కానీ ఈ క్రమంలో తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన కక్కిరాల పురుషోత్తం అశ్వారావుపేటలో పెట్రోల్ బంకుతో పాటు, పలు వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషిణి, 12, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. బుధవారం ఆ దంపతుల పెళ్లిరోజు కావడంతో కుటుంబ సమేతంగా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని జలపాతం వద్దకు విహారానికి వెళ్లారు. పెద్ద కుమారుడు నీటి ప్రవాహంలో పడి మునిగి పోతుండగా పురుషోత్తం ప్రవాహంలోకి దిగి పైన ఉన్న భార్యకు కుమారుడ్ని అందించి కాపాడాడు. ఈ క్రమంలో తాను నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ లోయలో పడిపోయాడు. భార్య, కుమారులు ద్వారా సమాచారం తెలుసుకున్న స్థానికులు 2 గంటలపాటు శ్రమించి లోయలో పడి విగతజీవిగా మారిన పురుషోత్తం మృతదేహాన్ని పైకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చింతూరు ఆసుపత్రికి తరలించారు.