తూర్పు గోదావరి: కాకినాడ నగరంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు రూ. 6. 52 కోట్లు మంజూరు చేస్తూ కాకినాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం తీర్మానించింది. కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం మేయర్ చాంబర్లో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి మేయర్ సుంకర శివప్రసన్న అధ్యక్షత వహించారు. అజెండాకు 16 అంశాలను తీసుకురాగా 15 అంశాలను ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించారు. విక్టోరియా వాటర్ వర్క్స్ ఆవరణలోని స్మార్ట్సిటీ భవనంలో తాత్కాలికంగా కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు చేసినందుకు స్మార్ట్సిటీ లిమిటెడ్కు 18 నెలల అద్దె, జీఎ్సటీ, నిర్వహణ చార్జీల నిమిత్తం రూ. 35 లక్షలు చెల్లించేందుకు తీసుకువచ్చిన అంశంపై సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ కార్పొరేషన్ స్థలంలో నిర్మించిన స్మార్ట్సిటీ భవనం నిమిత్తం ఎటువంటి రుసుం కార్పొరేషన్కు చెల్లించలేనందున ఎటువంటి అద్దె చెల్లించడం కుదరదని, కావాలంటే విద్యుత్ చార్జీలు భరించేందుకు అభ్యంతరం లేదని తెలిపారు.