విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండలం అన్నమరాజుపేట గ్రామానికి చెందిన బుగత అప్పలరాజు కుమారుడు బుగత శివ(19) తల్లిదండ్రులు మందలించారని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే. శివ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంటివద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఈమధ్యకాలంలో శివ రాత్రి వేళల్లో ఇంటికి ఆలస్యంగా రావడం గమనించిన తల్లిదండ్రులు శివని సోమవారం మధ్యాహ్నం మందలించారు.
అదే రోజు రాత్రి 7గంటల సమయంలో శివ మేడపై ఉండటం గమనించిన తల్లి మంగ అన్నం తినడానికి రమ్మని పిలువగా మేడ దిగి, అందరూ జాగ్రత్త అని చెప్పి నేను పురుగుల మందు త్రాగానని చెప్పడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు 108 వాహనంలో విజయనగరం మహారాజా ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్ కి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం నిమిత్తం మెడికేర్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శివ మరణించాడు. తన కళ్ళముందే తమ బిడ్డ అనంత లోకాలకు వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక తీవ్రంగా రోదిస్తున్నారు.