తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానంటూ. అగ్ని సాక్షిగా తాళి కట్టి వివాహం చేసుకున్న భర్త కాలయముడై భార్య ప్రాణాలను తీసిన హృదయ విదారక ఘటన శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే
యస్. కోట నియోజకవర్గం కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెంలో నాగరాజు అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఈయన గత ఎనిమిది సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ మహిళను ప్రేమిస్తున్నానంటూ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరి వివాహబంధం ఎనిమిది సంవత్సరాలు సాఫీగా జరిగింది. వీరికి ఆరేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇదిలాఉంటే ఇటీవల కొంత కాలం క్రితం నాగరాజు వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని ఆయన భార్యకు దూరంగా ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో ఆమె తమ కొడుకుతో వేరే ఇంట్లో నివాసముంటూ తమ జీవనోపాధి కొరకు షాప్ లో ఉద్యోగం చేసుకుంటోంది. గత శుక్రవారం ఆమె షాప్ కి వెళ్లి తిరిగి వస్తున్న నేపథ్యంలో భర్త నాగరాజు మాయమాటలు చెప్పి ఆమెను ఊరు పొలిమేర వద్దకు తీసుకుని వెళ్ళి హతమార్చి నిప్పంటించి బూడిద చేశాడు. నాగరాజు భార్య మృతి పట్ల స్థానికులకు అనుమానం వచ్చి కొత్తవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ బాల సూర్యారావు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి తమ స్టైల్ లో విచారణ చేపట్టారు. తన భార్యను తానే హతమార్చినట్లు నాగరాజు పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ మేరకు కొత్తవలస పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజుకు కఠిన శిక్ష అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.