తూర్పు గోదావరి జిల్లా: మండపేట బైపాస్ రోడ్ లోని బాణాసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి నలుగురు క్షతగాత్రులయ్యారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రోజువారీ పనిలో భాగంగా బాణసంచా తయారు చేస్తుండగా మందుగుండు రాచుకోడంతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో నలుగురు గాయాల పాలు కాగా వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు ఉన్నారు.
స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. సంఘటన స్థలాన్ని సిఐ దుర్గాప్రసాద్, తాహసిల్దార్ రాజేశ్వరరావు, అగ్నిమాపక అధికారి అబ్రహం పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కాకినాడ తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.