కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలుకు నిప్పంటించిన ఘటనలో కాపులపై నమోదైన కేసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తేసింది.ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తుని ఘటనతో పాటు.. జనవరి 2016 నుంచి మార్చి 2019 వరకు నమోదైన 161 కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాపు ఉద్యమం సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులు ఎత్తివేస్తూ హోమ్ శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేశారు.
కాగా, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో భాగంగానే 2016 జనవరిలో తుని భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే, బహిరంగ సభలో పాల్గొన్న ఆందోళనకారుల ఆగ్రహావేశాలు కట్టలు తెగడంతో దాడులకు పాల్పడ్డారు. రైలుకు నిప్పు పెట్టారు. దాంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఘటనకు బాధ్యులైన వారిపై 69 కేసులను నమోదు చేసింది. అయితే, వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చాక.. క్రమ క్రమంగా కేసులను ఉపసంహరించుకుంటూ వస్తోంది. కాపు ఉద్యమానికి సంబంధించి నమోదైన అన్ని కేసులనూ ఎత్తివేసింది.